ఏవో కొన్ని కారణాల వల్ల పిల్లలకు పుస్తకంలోని ఒకటి రెండు పాఠ్యాంశాలు సగం సగంగానే అర్థమై ఉండవచ్చు. ఆ పాఠం తాలూకు సందేహాల్ని నివృత్తి చేసుకునే అవకాశం ఆ తర్వాత కూడా రాకపోవచ్చు. అలాంటప్పుడు ఆ అంశానికి సంబంధించిన అస్పష్టత వాళ్ల మనసులో అలా కొనసాగుతూనే ఉంటుంది. పరీక్షల సమయంలో పిల్లలుఆ పాఠాలను చదవకుండా దాటవేస్తుంటారు. అది గమనించిన తల్లిదండ్రులు ఆ అంశం గురించే పదేపదే అడుగుతుంటారు. ఇది వాళ్లను తీవ్రమైన అసహనానికీ, అలజడికీ గురిచేస్తుంది. అంతిమంగా ఆత్మన్యూనతా భావానికి కూడా గురిచేస్తుంది. దాంతో బాగా చదవగలిగే పాఠ్యాంశాలపై కూడా మనసు లగ్నం కాదు. పరీక్షల్లో ఒకవేళ వదిలేసిన పాఠ్యాంశాల మీదే ఒకటి రెండు ప్రశ్నలు వచ్చినా, వాటిని ఛాయిస్ కింద వదిలేసే అవకాశం పిల్లలకు ఎలాగూ ఉంటుంది కదా! అంత మాత్రానికి పిల్లలను అవి చదివితీరాల్సిందేనని ఒత్తిడి చేయడం దేనికి?
నిజానికి తల్లిదండ్రుల్లో ఇలా మొదలైన ఈ ధోరణి పిల్లలు పెద్దవాళ్లయ్యే కొద్దీ అలా పెరుగుతూనే ఉంటుంది. పిల్లల అభిప్రాయాల్ని, ఆలోచనల్ని కావాలని నిర్భంధించడం క్రమక్రమంగా వాళ్లకో అలవాటుగా మారుతుంది. ఇది తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య దూరాన్ని పెంచుతుంది. ఫలితంగా, యుక్తవయసు వచ్చేనాటికి పిల్లలు కూడా తల్లిదండ్రుల సలహాలనూ, సూచనలనూ లెక్కచేయరు. లేత వయసులో వాళ్లమీద ఒత్తిడి చేస్తే, ఆ తర్వాత కాలంలో పిల్లల ధోరణి దురుసుగా మారుతుంది. అందుకే కొన్ని విషయాల్లోనైనా పిల్లలకు ఛాయిస్ ఇవ్వాలి. అది పిల్లల ఆత్మవిశ్వాసాన్నీ, తల్లిదండ్రులకూ వాళ్లకూ మధ్యనున్న ఆత్మీయతనూ కాపాడుతుంది.