జాతీయ దర్యాప్తు సంస్థ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్ఐఏ) మొట్టమొదటి సారిగా అమిర్ జుబేర్ సిద్ధిఖీ అనే పాకిస్థానీ దౌత్యవేత్త పేరును ‘మోస్ట్ వాంటెడ్ లిస్ట్’లో చేర్చడంతో పాటు తొలిసారిగా పాక్కు చెందిన ఈ స్థాయి అధికారిపై రెడ్కార్నర్ నోటీస్ జారీ కోసం ఇంటర్పోల్కు విజ్ఞప్తి చేయనుంది. పదేళ్ల క్రితం నవంబర్లో ముంబైలో జరిపిన ఉగ్ర మారణకాండ తరహాలో మరోసారి భారత్లోని అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై, దక్షిణ భారత్లోని ఆర్మీ, నేవీ కమాండ్లపై దాడికి ఈ రాయబారి కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ తేల్చింది.
సిద్ధిఖీ ఫోటోను కూడా విడుదల చేయడంతో పాటు అతడికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా కోరింది. ఈ రాయబారితో పాటు మరో ముగ్గురు పాకిస్థానీ అధికారులు కూడా ఈ కుట్ర భాగస్వాములని, వారిలో ఇద్దరి పేర్లను కూడా ఈ లిస్ట్లో చేర్చినట్టు పేర్కొంది. వీరిని అదుపులోకి తీసుకోవడం కోసం అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్పై ‘రెడ్ కార్నర్ నోటీస్’ జారీకి ఇంటర్పోల్ను విజ్ఞప్తి చేసేందుకు కూడా ఎన్ఐఏ సిద్ధమవుతోంది.
2008 నవంబర్ 26న ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్తో పాటు తాజ్, ట్రైడెండ్ హోటల్, తదితర ప్రాంతాల్లో పాక్ ప్రేరేపిత లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు బాంబులు, అధునాతన తుపాకులతో దాడి చేసి నాలుగు రోజుల పాటు మారణహోమాన్ని సృష్టించి 166 మంది (9 మంది ఉగ్రవాదులతో సహా)ని పైగా పొట్టనబెట్టుకున్నారు. ప్రాణాలతో దొరికిన అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదిని ఆ తర్వాత కోర్టులో విచారించి ఉరి తీసిన విషయం తెలిసిందే.