Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో కకావికలమైన కేరళకు ఆపన్నహస్తం అందించింది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ). రాష్ట్రానికి భూరి విరాళాన్ని ప్రకటించి ఉదారతను చాటుకుంది. కేరళను ఆదుకునేందుకు రూ.700కోట్ల ఆర్థికసాయం చేస్తామని యూఏఈ హామీ ఇచ్చిందని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ మంగళవారం వెల్లడించారు.

‘ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న కేరళకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాల వారే గాక.. ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఆపన్నహస్తం అందిస్తున్నారు. యూఏఈ ప్రభుత్వం మరింత ముందుకొచ్చి కేరళకు సహాయనిధిని ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం రాష్ట్రానికి 100 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ. 700కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని యూఏఈ హామీ ఇచ్చింది. ఈ విషయమై అబుదాబీ యువరాజు.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడారు’ అని పినరయి విజయన్‌ తెలిపారు.

కేరళకు సాయం చేస్తామని యూఏఈ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘యూఏఈ విజయంలో కేరళ ప్రజల పాత్ర ఎంతో ఉంది. వారిని ఆదుకునేందుకు మేం తప్పకుండా సాయం చేస్తాం’ అని ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఇటీవల ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని కూడా నియమిస్తున్నట్లు ఆయన చెప్పారు.

భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా వరద ప్రభావం తగ్గలేదు. దాదాపు 10వేల కి.మీ రోడ్లు, లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల సంబంధిత ఘటనల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.