ఏ దేశమేగినా ఎందుకాలిడినా కబ్జాలే కబ్జాలు. సాక్షాత్తూ అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అయిన హైదరాబాద్ వ్యాప్తంగా కబ్జాలే కబ్జాలు. ఏపీలో కబ్జాలు, తెలంగాణ లో కబ్జాలు.. కర్ణాటకలో కబ్జాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ కాదేదీ కబ్జా కనర్హం. తవ్వే కొద్దీ కబ్జాలు బయటికి వస్తున్నాయి.. ఏ కబ్జాకేగినా ఏ భూమిలో అడుగుపెట్టినా మంత్రులు, వాళ్ల చుట్టాలు – బంధువులే. అధికారులతో కుమ్మక్కవ్వడం .. రిజిష్టార్లనే ఇంటికి రప్పించుకోవడం.. ఇక డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసుకోవడం.. అలాంటివి మూడు నాలుగు క్రియేట్ చేసుకోవడం.. వాటిని ముగ్గరు నలుగురికి అమ్మేయడం.. వ్వాహ్.. ఈ ఆటేదో బావుంది.
అసలు ఈ పనికిమాలిన హైస్కూల్ చదువులు ఎవడు కనిపెట్టాడో కానీ వాడిని పట్టుకుని తన్నాలి. అనవసరంగా ఏబీసీడీలు నేర్చుకుని.. అటుపై స్కూళ్లలో పలకా-బలపం పట్టుకుని, మోపెడు బ్యాగు మీదేసుకుని బుర్రవాచేలా చదువులు చదవడం బొప్పి కట్టించుకోవడం వట్టి దండగ. బోర్డు స్కూలు, హైస్కూలు, కాలేజీ అంటూ జీవితం మొత్తం చంకనాకించుకోవడం అంతకంటే పెద్ద దండగ. అదేదో ఈ కబ్జా స్కీములో ఏదైనా డిగ్రీలు ఉంటే చదువుకుంటేనే బెటర్ కదా! దీనిని ఓ సబ్జెక్టు లాగా స్కూళ్లు కాలేజీల్లో ఇంట్రడ్యూస్ చేస్తే అసలు నిరుద్యోగం అన్నదే లేకుండా పోతుంది. అసలు ఈ భూమ్మీద భూమి ఎంత ఉందో లెక్కలు వేసుకోవడం.. ఒక్కో కబ్జాకి ఎలా ప్లాన్ గీయాలో నేర్చుకోవడం.. అటుపై దొరికిందంతే దోచేసుకోవడం.. అమ్మినకాడికి అమ్ముకోవడం.. బినామీ పేర్ల మీద దాచుకోవడం.. డబ్బు సంపాదించి ఫుల్లుగా ఎంజాయ్ చేయడం.. ఈ డిగ్రీనే బావుంటుంది కదా! దేవుడా అసలు నాకు బడి ఎందుకు? అని నిరుద్యోగులంతా ఏడ్చేంత గొప్పగా ఉన్నాయి ఈ కబ్జా కథలన్నీ. ఈ ఐడియా బావుంది కదూ మోదీ గారూ.. అలాంటి కబ్జా కాలేజీలేవైనా ప్రారంభించండి బాబూ.. మీకు పుణ్యం ఉంటది!!